సిక్కింలో 12 మంది కార్మికుల మృతి
శిథిలాల కింద మరో 13 మంది
గ్యాంగ్టక్ : సిక్కింలో నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పిసి)కు చెందిన నిర్మాణంలో ఉన్న ఒక సొరంగంలో భారీ పేలుడు సంభవించడంతో 12 మంది కార్మికులు మృతి చెందారు. మరో 13 మంది సొరంగం లోపల శిథిలాల కిందనే చిక్కుపోయారు. తీస్తా స్టేట్-4 జల విద్యుత్ ప్రాజెక్టులో భాగంగా నామ్చి జిల్లాలో నిర్మిస్తున్న సొరంగంలో సోమవారం మధ్యాహ్నం 1:04 గంటలకు ఈ పేలుడు జరిగిందని ఎన్హెచ్పిసి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సొరంగంలోని రాళ్లు, నేలలో ఉన్న మీథేన్ గ్యాస్ అకస్మాత్తుగా విడుదల కావడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం రాష్ట్ర రాజధాని అయిన గ్యాంగ్టక్కు దక్షిణంగా సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీథేన్ వాయువు అకస్మాత్తుగా పేలుడుతో విడుదల కావడంతో దట్టమైన పొగ, విష వాయువులతో సొరంగం నిండిపోయినట్లు, ప్రమాద సమయంలో 25 మంది కార్మికులు ఉన్నట్లు ఎన్హెచ్పిసి తన ప్రకటనలో తెలిపింది. చిక్కుకున్న వారిని రక్షించడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలతో కలిసి సహయక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే, గనుల భద్రతా డైరెక్టర్ జనరల్ కార్యాలయం నుండి ఒక ప్రత్యేక సహాయక బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది.







కామెంట్లు (0)