- ఆలాపన పూర్తి కాకుండానే వేదిక నుంచి నిష్క్రమణ
- సర్వత్రా విమర్శలు
లక్నో : మన జాతీయ గీతం ‘జనగణమన’కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా తీవ్ర అవమానం చేశారు. ఒక కార్యక్రమంలో జనగణమన ఆలాపన ఇంకా జరుగుతుండగానే వేదిక దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఉన్నావ్లో జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా మహానా నడుచుకుంటూ వెళ్లిపోతున్న సమయంలో కొంతమంది ఆయనకు పాదాలకు నమస్కారం చేస్తుండటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మహానా తన వాహనంలో కూర్చుని అక్కడి నుండి వెళుపోతున్న సమయంలో కూడా జాతీయ గీతం వెనక నుంచి వినిపిస్తూనే ఉంది. ఉన్నావ్లోని ఎస్విఎం ఇంటర్ కాలేజీలో ఇటీవల జరిగిన కౌన్సిల్ ప్రాంతీయ సమావేశం- సదస్సుకు స్పీకర్ హాజరయ్యారు. ఈ సమయంలో ప్రోటోకాల్లో భాగంగా, పోలీసులు ఆ వేదిక వద్ద మహానాకు 'గార్డ్ ఆఫ్ ఆనర్' ఇచ్చారు. గౌరవ వందనం ముగిసిన వెంటనే జాతీయ గీతం ప్రారంభమైంది. కేవలం కొన్ని సెక్లన్లు ఉన్న మహానా వెంటనే వేదిక దిగి నిష్క్రమించారు. వందేమాతరం పూర్తి చరణాలను పాడాలంటూ బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్న సమయంలోనే ఇలాంటి ఘటన జరగడం విశేషం. బిజెపి స్పీకర్ కేవలం 52 సెకన్లు కూడా ఉండలేకపోయారని, ఆ పార్టీ ఇప్పుడు దీనికేం సమాధానం చెబుతుందని కాంగ్రెస్ ప్రశ్నించింది. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చీఫ్ సుప్రియా ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు. 'జన గణ మన'కు జరిగిన ఈ "అవమానాన్ని" సహించమని, దీనికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.







కామెంట్లు (0)