- ఆమ్నెస్టీ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : నీట్ లీకేజి వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై పోలీసులు తీవ్రమైన హింసకు పాల్పడ్డారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సోమవారం పేర్కొంది. విద్యార్థులపై విద్యుత్ షాక్ పరికరాలు, పెల్లెట్ గన్లతో సహా మితిమీరిన బలప్రయోగం చేశారని విమర్శించింది. బీహార్లో నిరసనకారులపై ‘‘పెల్లెట్-ఫైరింగ్ షాట్గన్లు, టియర్ గ్యాస్ లాంచర్లు, గ్రెనేడ్లు, లాఠీలు, విద్యుత్ షాక్ పరికరాలను’’ ప్రయోగించారని విశ్వసనీయ సాక్షుల వాంగ్మూలాలు, వీడియోల ద్వారా స్పష్టమయిందని ఆమ్నెస్టీ తెలిపింది.
చట్టాన్ని ఉల్లంఘించి దాడులు....
బీహార్లోని సివాన్ జిల్లాలో ఒక పోలీసు అధికారి ఆందోళనలపై చట్టవిరుద్ధంగా ‘ప్రాణాంతక ఆయుధాన్ని’ ప్రయోగించారనే ఖచ్చితమైన సాక్ష్యాలున్నాయని అమ్నెస్టీ వెల్లడించింది. విద్యార్థుల ఆందోళనలపై ‘అంతర్జాతీయ చట్టాలు, నియమాలు, దేశీయ పోలీసింగ్ మార్గదర్శకాలను ఉల్లంఘించే విధంగా ఆయుధాలను ప్రయోగించారు’ అని అమ్నెస్టీ విమర్శించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్విన ఘటనలు అక్కడక్కడా జరిగినా.. పోలీసులు చేసిన ఈ తీవ్రమైన హింస ‘ఆందోళనలను అణిచివేయడానికి ప్రభుత్వం ఆమోదించిన హింస’ ఆమ్నెస్టీ అభివర్ణించింది. నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా పాటు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో విద్యార్థులు ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలపై జరిగిన హింసపై విచారణ కోసం ఈ నెల 20న ఒక కమిటీని కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సందర్భంలో ఆమ్నెస్టీ ఈ వివరాలను వెల్లడించడం గమనార్హం.







కామెంట్లు (0)