- యుపిలో అధ్వాన్నంగా మధ్యాహ్న భోజనం
- సీతాపూర్ ఘటనతో బయటపడ్డ డబుల్ ఇంజిన్ సర్కార్ డొల్లతనం
లక్నో: ఉత్తరప్రదేశ్లో బిజెపి ఏలుబడిలోని డబుల్ ఇంజన్ సర్కార్ డొల్లతనం బయటపడింది. ప్రభుత్వ పాఠశాలలల్లో అధ్వాన్న పరిస్థితులకు అద్దంపడుతోంది. దేశంలోనే అత్యధిక పన్నులా వాటా సొమ్మును కుమ్మరిస్తున్నా...పాఠశాల విద్యార్థులకు కనీసం మధ్యాహ్నం పూట సరైన భోజనం కూడా పెట్టడం లేదు. కూరలు నీళ్లలను తలపిస్తుంటే..నాసిరకం పిండితో మాడిపోయిన రోటీలు బొగ్గులను మరిపిస్తున్నాయి. సీతాపూర్ జిల్లాలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు వడ్డించిన ఈ భోజనంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూర్చోవడానికి సరైన వసతి కూడా లేకపోవడంతో నేలపై చెత్త మధ్యనే ఉడికి ఉడకని, మాడిన చపాతీలను నీళ్ల కర్రీతో తింటూ పిల్లలు కనిపించారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పిల్లలకు అందిస్తున్న నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పోలుస్తూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'పిఎం పోషణ్' పథకం ప్రకారం, ప్రతి విద్యార్థికి రోజుకు 450 కేలరీలు, 12 గ్రాముల ప్రొటీన్ అందాలి. అయితే సీతాపూర్ పాఠశాలలో అందించిన భోజనం ఈ ప్రమాణాలకు ఏమాత్రం సరిపోలేదని స్పష్టమైంది. సర్వత్రా విమర్శలు రావడంతో యోగి సర్కార్ నష్ట నివారణ చర్యలకు దిగింది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా బేసిక్ శిక్షా అధికారి కార్యాలయం, ప్రధానోపాధ్యాయురాలు కల్పనా వర్మను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజన పంపిణీలో నాణ్యత లోపం, పరిమాణం సరిగా లేకపోవడం వంటి అంశాలు నిర్థారించారు. విద్యార్థులకు అందించాల్సిన పాలు, గుడ్లు నిర్దేశిత పరిమాణంలో సరఫరా కాలేదని, పంపిణీ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య నిర్లక్ష్యంగా వ్యవహరించారని విచారణలో తేలింది. అయితే, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం ఒక్కరిపై చర్యతో సరిపోదని, పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని పలువురు డిమాండ్ చేస్తున్నారు.








కామెంట్లు (0)