- అర్ధరాత్రి ఆలయం కూల్చివేత
- ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్తో తొలగింపు
లక్నో : బిజెపి ప్రభుత్వం బుల్డోజర్తో ఆలయాన్ని కూలగొడుతున్న నేపథ్యంలో కార్మికుడు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్లోని చందౌలీ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రోడ్డు వెడల్పుకు అడ్డంగా ఉందని 200 ఏళ్ల నాటి కాళీమాత ఆలయాన్ని బుల్డోజర్తో యోగీ ప్రభుత్వం కూల్చేసింది.
ఏం జరిగింది?
మొఘల్సరాయ్లో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు వెడల్పునకు పురాతన కాళీమాత ఆలయం అడ్డంగా ఉందని ఆ ఆలయాన్ని ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఇద్దరు కూలీలు తాడు పట్టుకుని సుమారు 10 అడుగుల దూరంలో నిలబడి ఉండగా, గోపురం అత్యంత వేగంగా కుప్పకూలడంతో వారు తప్పించుకునే అవకాశం లేకుండా శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికులు శిథిలాలను తొలగించి వారిని బయటకు తీశారు. అయితే 58 ఏళ్ల బల్దేవ్ యాదవ్ మృతి చెందగా, మరో కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్న అనంతరం కూల్చివేత పనులను నిలిపివేశారు.
స్పందించని యోగి ప్రభుత్వం
జుమ్రీ గ్రామానికి చెందిన నత్నీ యాదవ్ మాట్లాడుతూ.. తన సోదరుడు బల్దేవ్ మృతి చెందిన విషయాన్ని అధికారులు సకాలంలో సమాచారమందించలేదన్నారు. తాను సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఎవరూ స్పందించలేదన్నారు. అనంతరం తన సోదరుడి ఫోన్ను తనకు అందజేశారని తెలిపారు. కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, బల్దేవ్ కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని యోగి ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అయితే సంఘటన అనంతరం ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనా లేదు. దీంతో మీడియా ఎస్డిఎం మోహన్ సక్సేనా దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధిత కుటుంబానికి సహాయం అందిస్తామని తెలిపారు. అయితే రోడ్డు వెడల్పు పనులను ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించామన్నారు.








కామెంట్లు (0)