చెన్నై : దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. చెన్నై చిదంరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అజేయ సెంచరీతో కదం తొక్కడంతో ఆ జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. ఆదివారం సౌత్జోన్తో మొదలైన ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్జోన్ 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది._ఇషాన్ కిషన్ (135 బంతుల్లో 111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (75 బంతుల్లో 63 నాటౌట్) క్రీజులో ఉన్నారు. సౌత్జోన్ బౌలర్లలో సీవీ మిలింద్ 2 వికెట్లు, త్రిపురాణా విజయ్ ఒక వికెట్ పడగొట్టాడు.
అధరగొట్టిన వైభవ్, అభిమన్యు, శిఖర్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్జోన్కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో 44, 5 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (86 బంతుల్లో 72 పరుగులు) మరో ఎండ్లో నింపాదిగా ఆడాడు.
వైభవ్ ఔటయ్యాకా బరిలోకి దిగిన శ్రీకర్ మోహన్ (120 బంతుల్లో 85 పరుగులు) కూడా తనదైన శైలి బ్యాటింగ్తో అలరించాడు. అభిమన్యు, సుదీప్ కుమార్ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగిన్పటికీ, శిఖర్కు జత కలిసిన ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. సౌత్జోన్ బౌలింగ్ను దీటుగా ఆడుతూ ఇషాన్ అర్ధసెంచరీ మార్క్ చేరుకున్నాడు._
శిఖర్ ఔటైనప్పటికీ, కుమార్ కుషాగ్ర వేగంగా ఆడి పరుగులు రాబట్టాడు. ఇషాన్ కిషన్ సెంచరీ పూర్తి చేశాడు. ఇషాన్ కిషన్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది పదో సెంచరీ. అనంతరం కాసేపటికే కుమార్ కుషాగ్ర కూడా అర్థసెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే బ్యాడ్లైట్ కారణంగా అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు.








కామెంట్లు (0)