ఒంటిపూటకే పరిమితమైన భూ రీసర్వే
ఏడాది తరబడి సాగుతుందా ?
అధికారుల తీరుపై ఆగ్రహం
రైతులు లేకుండానే క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నారని ఆరోపణ
ప్రజాశక్తి-రేగిడి (విజయనగరం) : సమగ్ర భూ సర్వేకు సర్వేయర్లు సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో భూముల రీసర్వే ప్రక్రియ మందకొడిగా సాగుతోందని సంకిలి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేకు తగిన సిబ్బందిని కేటాయించకుండా ఒక్క బృందంతోనే పనులు నడిపిస్తుండటంతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సంకిలి రైతులు సోమవారం స్థానిక సచివాలయం ఎదుట నిరసన తెలిపారు. సంకిలి పంచాయతీ రేగిడి మండలానికే రెండువ అతిపెద్ద పంచాయతీ. భౌగోళికంగా చాలా విస్తరణ గల భూములు ఉన్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న సర్వే బృందం ఒంటిపూటకే పరిమితమై మందకొడిగా పనులు నిర్వహిస్తోందని ఆరోపించారు. ఇదే వేగంతో సర్వే కొనసాగితే ఏడాది గడిచినా పూర్తయ్యే పరిస్థితి లేదని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో రైతుల సమక్షంలో భూముల హద్దులు, వివరాలను పరిశీలించాల్సి ఉండగా.. కొన్నిచోట్ల రైతులు అందుబాటులో లేకుండానే సర్వే చేస్తున్నారని రైతులు ఆరోపించారు. భవిష్యత్తులో భూ వివాదాలకు ఇది కారణమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని అదనపు సర్వే బృందాలను ఏర్పాటు చేయాలని, సర్వే పనులను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల సమక్షంలోనే క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఉన్నతాధికారులు దృష్టి సారించి సరే బృందాలను ఎక్కువ మంది ఏర్పాటు చేసి భూ సర్వే పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ నిరసనలో బింగి శ్రీరామ్మూర్తి, బట్న తవిటి నాయుడు, గుండ దామోదర్, ఇప్పిలి సింహాచలం, బట్న శివశంకర్ తదితర రైతులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)