సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర..
చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా!
భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో హెజి టింగ్-రెన్ గ్జియాంగ్ జోడీపై విజయం సాధించింది. చైనా గోడను బద్దలుకొట్టిన ఈ జోడికి ఇదే తొలి చైనా మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో వరుసగా రెండుసార్లు (2023, 2025లో) రన్నరప్గా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ మూడో దఫాలో మాత్రం చాంపియన్గా నిలిచింది. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కాగా, ఇటీవలే సింగపూర్ ఓపెన్ సూపర్-750 టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలోనూ ఈ జంట ఫైనల్కు చేరింది.
మ్యాచ్ ఆరంభం నుంచి మంచి ఈజ్తో కనిపించినప్పటికీ సాత్విక్-చిరాగ్ ద్వయం తొలి గేమ్ను కోల్పోయారు. అయితే రెండో గేమ్లో మాత్రం ఫుంజుకున్న ఈ జంట 21-13తో చైనా జోడికి చెక్ పెట్టారు. ఇక కీలకమైన మూడో గేమ్లో మాత్రం మొదట తడబడడంతో ఈసారి కూడా రన్నరప్కే పరిమితమవుతారేమోననిపించింది.
ఒక దశలో 11-9తో వెనుకబడిన సాత్విక్ జంట విజృంభించి 16-16తో స్కోరును సమం చేసింది. ఈ దశలో ఒక్కసారిగా చెలరేగిపోయిన సాత్విక్, చిరాగ్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా 21-17తో గేమ్ను ముగించడంతో పాటు మ్యాచ్ను గెలిచారు. 2023, 2025 సీజన్లలో ఫైనల్కు చేరినప్పటికీ రన్నరప్కే పరిమితమైన సాత్విక్, చిరాగ్ ద్వయం ఈసారి మాత్రం టైటిల్ గెలుపే లక్ష్యంగా ఆటను కొనసాగించారు. ఇన్నాళ్లు చైనా ఫోబియాను ఎదుర్కొన్న ఈ జంట అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ చాంపియన్స్గా నిలిచారు.








కామెంట్లు (0)