లాహోర్: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉదాహరణగా చూపుతూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)పై తీవ్ర విమర్శలు చేశారు. ఐపీఎల్తో పోలిస్తే యువ బ్యాటింగ్ ప్రతిభను వెలికితీసి, అభివృద్ధి చేయడంలో పీఎస్ఎల్ ఇంకా వెనుకబడే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపీఎల్లో ఆకట్టుకునే ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే భారత అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచిన విషయాన్ని అక్రమ్ ప్రస్తావించారు. పీఎస్ఎల్ ప్రారంభమై దాదాపు పదేళ్లు పూర్తయినా, సూర్యవంశీ లాంటి అత్యుత్తమ బ్యాటింగ్ ప్రతిభను పాకిస్థాన్ ఎందుకు తయారు చేయలేకపోయిందని ప్రశ్నించారు.
పీఎస్ఎల్ ద్వారా కొంతమంది గొప్ప బౌలర్లను తయారు చేయగలిగామని, అయితే బ్యాటింగ్లోనూ అదే స్థాయిలో ప్రతిభను అభివృద్ధి చేసినప్పుడే నిజమైన పురోగతి సాధించినట్లు భావించవచ్చని అక్రమ్ పేర్కొన్నారు. అదే సమయంలో పాకిస్థాన్లో క్లబ్ క్రికెట్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. యువ క్రికెటర్లకు క్లబ్ క్రికెట్నే పునాది అని, అక్కడి నుంచే ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కరాచీ, లాహోర్ నగరాల్లో క్లబ్ క్రికెట్ అభివృద్ధికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చెరో 100 మిలియన్ పాకిస్థానీ రూపాయలు కేటాయించాలని అక్రమ్ సూచించారు.
ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు బౌలింగ్ కోచ్, మెంటర్గా పనిచేసిన అక్రమ్ ఆ జట్టుతో కలిసి రెండు టైటిళ్లు గెలుచుకున్నారు. పీఎస్ఎల్లోనూ ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ జట్లకు కోచ్, మెంటర్గా ఆయన సేవలందించారు.








కామెంట్లు (0)