ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లా ప్రజా పరిషత్ల ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్ ల పదవీ కాలం 2026 సెప్టెంబర్ 24తో ముగియనుండటంతో, కొత్తగా ఏర్పాటైన 28 జిల్లాల పరిపాలనా నిర్మాణానికి అనుగుణంగా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఒక కీలకమైన మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలోని ప్రస్తుత 28 జిల్లాల పరిపాలనా విభాగానికి అనుగుణంగా 28 జిల్లా ప్రజా పరిషత్లను ఏర్పాటు చేస్తూ/పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం అధికారికంగా జిఒ ఎంఎస్ నం. 114 ద్వారా ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ఉన్న 13 జిల్లాలను 2022 ఏప్రిల్లో 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నవంబర్ 2025లో మార్కాపురం, పోలవరం అనే రెండు కొత్త జిల్లాలను చేర్చడంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది. ఇప్పటివరకు జిల్లా పరిషత్లు పాత 13 జిల్లాల ప్రాతిపదికన మాత్రమే కొనసాగాయి. ప్రస్తుత పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం 2026 సెప్టెంబర్ 24తో ముగియనుండటంతో, సెప్టెంబర్ 25 నుండి ఈ కొత్త 28 జిల్లా పరిషత్ల వ్యవస్థ అమలులోకి రానుంది.ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా 28 జిల్లాలకు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ నాయకత్వాన్ని అందించడం కోసం ప్రభుత్వం 15 అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను, అలాగే 15 అదనపు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేసింది. కొత్తగా నియమితులయ్యే సీఈఓలకు రూ. 80,910 – 1,66,680, డిప్యూటీ సీఈఓలకు రూ. 65,360 – 1,54,980 కాలపరిమితి వేతనాన్ని ఖరారు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మినిస్టీరియల్ సపోర్టింగ్ స్టాఫ్ను ఆయా జిల్లాల పరిధిలోని మండలాల సంఖ్య, పనిభారానికి తగినట్లుగా 28 జిల్లాలకు హేతుబద్ధీకరించి కేటాయించనున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 660 మండలాలు ఇకపై ఆయా జిల్లాల పరిధిలోని కొత్త జిల్లా ప్రజా పరిషత్ల పరిపాలన, సమన్వయం పర్యవేక్షణలోకి రానున్నాయి. ఈ పరివర్తన ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్తో పాటు జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
28 జిల్లా పరిషత్ లు ఏర్పాటు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 05:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు





కామెంట్లు (0)