సంయుక్త సమావేశంలో ఐసిడిఎస్ అధికారుల హామీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్వాడీల వేతనాలు పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఐసిడిఎస్ జాయింట్ డైరెక్టర్లు ప్రవీణ, శివకుమారి తెలిపారు. గుంటూరులోని ఐసిడిఎస్ డైరెక్టరు కార్యాలయంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు), ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఎఐటియుసి), ఎపి ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) నేతలతో సంయుక్త సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్లు మాట్లాడుతూ.. మెయిన్ సెంట్రర్లుగా మారని 760 మినీ సెంటర్లను వెంటనే అప్గ్రేడ్ చేస్తామని తెలియజేశారు. హెల్పర్ల ప్రమోషన్లు గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఉత్తర్వులిచ్చినట్లు తెలిపారు. మట్టి ఖర్చులకు సంబంధించి బడ్జెట్ కొంత ఇబ్బందులు ఉన్నందున సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మిగిలిన అన్ని అంశాలు ఐసిడిఎస్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లాల వారీ పెండింగ్లో ఉన్న సమస్యలను ఆయా జిల్లాల ఐసిడిఎస్ జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తగిన ఆదేశాలిస్తామని చెప్పారు. ఇటీవల కాలంలో ఉన్నతాధికారుల కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం.. అంగన్వాడీలకు రిటైర్మెంట్ సందర్భంగా గ్రాట్యుటీ చట్టం ప్రకారం చెల్లించడం, తల్లికి వందనం అమలు చేయడం పట్ల మూడు సంఘాల యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్వులు జి బేబిరాణి, కె సుబ్బరావమ్మ, ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి భారతి, జె లలితమ్మ, ఎపి ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి ఆర్ జ్యోతి పలు అంశాలను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తెచ్చారు. నవచేతనా యాప్ రద్దు చేయాలని, ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పనిచేసేలా జాబ్ చార్ట్ రూపొందించాలని, పెండింగ్లో ఉన్న 164 గ్రేడ్ 2 సూపర్ వైజరు పోస్టులు ఇవ్వాలని, తదితర సమస్యలను అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో ఆయా సంఘాల రాష్ట్ర నాయకులు ఎంసిహెచ్ సుప్రజ, ఎం నాగశేషం, చంద్రావతి, కృష్ణవేణి, రేఖ ఎలిజిబెత్, నిర్మల, కుమారి, మల్లేశ్వరి, దేవి, మాణిక్యమ్మ, రాజేశ్వరి, నాగమ్మ, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)