- నాయుడుపేటలో అదుపుతప్పిన లారీ
- చుట్టుపక్కల ఎంత వెతికినా డ్రైవర్ జాడ లేదంటున్న స్థానికులు
ప్రజాశక్తి-నాయుడుపేట: తిరుపతి జిల్లాలోని నాయుడుపేట చెన్నై హైవేపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 11 గంటల సమయంలో మహారాష్ట్రకు చెందిన ఓ లారీ చెన్నై వైపు లోడుతో వెళ్తుండగా అదుపుతప్పి హైవే పక్కన ఉన్న ఇళ్ల వైపు దూసుకెళ్లింది. అయితే ఇళ్లకు, లారీకి మధ్యలో కాలువ, చెట్టు ఉండటంతో లారీ కాలువలోకి దిగి చెట్టును ఢీకొని ఆగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ కిందకు దిగకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. చుట్టుపక్కల వారితో కలిసి లారీలో పరిశీలించగా డ్రైవర్ కనిపించలేదు. దీంతో లారీ కాలువలోకి దూసుకెళ్లే సమయంలో డ్రైవర్ పక్కకు దూకి ఉంటాడేమోనని భావించిన స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయితే డ్రైవర్ ఆచూకీ లభించకపోవడంతో స్థానికులు కొంత ఆందోళనకు గురయ్యారు. లారీ ఇక్కడికి ఎలా వచ్చింది, ప్రమాదానికి ముందు ఏం జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.








కామెంట్లు (0)