న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) జులై 20న చేపట్టిన నిరసనపై పోలీసులు జరిపిన చర్యలపై విచారణ కోసం నియమించిన ‘అధికారిక ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ’ (హెచ్పిఇసి)ని పునర్వ్యవస్థీకరించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. కమిటీలో ప్రయోజనాల వైరుధ్యం ఉందన్న పిటిషనర్ల వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్లు ఊహాగానాలు, ముందస్తు అభిప్రాయాలకు లోనయ్యారని విమర్శించింది. దర్యాప్తు కమిటీ పక్షపాతంగా వ్యవహరిస్తుందని తాము అనుమానించడం లేదని, దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందనే విశ్వాసాన్ని కలిగించాలని పిటిషనర్ల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాదులు ఎన్. హరిహరన్, గోపాల్ శంకరనారాయణన్, ప్రశాంత్ భూషణ్, వృందా గ్రోవర్, నేహా రాఠీలు వెల్లడించారు. అయితే, హెచ్పిఎఫ్సి దర్యాప్తు ప్రారంభించక ముందే పిటిషనర్ల నుండి ఆరోపణలు మొదలయ్యాయని ధర్మాసనం పేర్కొంది.
నీట్-యుజి పేపర్ లీక్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై పోలీసుల దాడులు సహా పలు సమస్యలు, ఆరోపణలను పరిశీలించేందుకు, సుప్రీంకోర్టు ఆగస్టు 20న మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలోని హెచ్పిఇసి కమిటీని ఆదేశించింది. జస్టిస్ రెడ్డితో పాటు, పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ శాలిందర్ కౌర్, సిబిఐ మాజీ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, మేఘాలయ రిటైర్డ్ డిఐజి డాక్టర్ ఎల్.ఆర్. బిష్ణోయ్లు ఈ కమిటీలో ఉన్నారు.







కామెంట్లు (0)