ఒక్కో మొక్కకు రూ.వెయ్యి సాయం
మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కోనసీమలో కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వ్యవసాయశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనసభలో సభ్యులు గిడ్డి సత్యనారాయణ, బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. రాష్ట్రంలో 1.18 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతుండగా, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే 36 వేల హెక్టార్లలో కొబ్బరి సాగవుతోందని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 10 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు కౌలు రైతుల ద్వారా సాగవుతున్నాయని వివరించారు. గత ఐదేళ్లుగా కాలువల్లో సక్రమంగా పూడికతీత చేపట్టకపోవడంతో సముద్రపు ఉప్పునీరు బ్యాక్ వాటర్ రూపంలో వెనక్కి వచ్చి నేలలో లవణీయత పెరిగిందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో పైకి ఆరోగ్యంగా కనిపించే కొబ్బరి చెట్లు కూడా అకస్మాత్తుగా కుంగిపోయి చనిపోతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. దెబ్బతిన్న ప్రతి కొబ్బరి మొక్క స్థానంలో కొత్త మొక్క నాటేందుకు ఒక్కో మొక్కకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సహాయం అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు. సమస్యకు మూలమైన డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారించామన్నారు. మొదటి విడతలో శంకరగుప్తం కాలువ పనులకు నిధులు కేటాయించామని, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఇప్పటికే శంకుస్థాపన చేశారని తెలిపారు. కొత్త కొబ్బరి తోటల విస్తరణకు హెక్టారుకు రూ.56 వేల సబ్సిడీని అందిస్తున్నామన్నారు. ప్రత్యేక ప్రాంతీయ కొబ్బరి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతూ కేంద్ర మంత్రికి లేఖ రాశారన్నారు.







కామెంట్లు (0)