పరిశ్రమ-విద్యాసంస్థల సహకారానికి ఒప్పందం
అదాని స్కిల్స్ , విద్యాశాఖ మధ్య ఎంఒయు
ప్రజాశక్తి - ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : విద్యారంగంలోకి కూడా అదానీ సంస్థలు దిగుతున్నాయి. ఈ మేరకు అదానీ స్కిల్స్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. పాలిటెక్నిక్ విద్యార్దులకు ప్రయోజనం కల్పించేందుకే ఈ ఒప్పందం అని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యా కమిషనరేట్, అదానీ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ మధ్య ఇండస్ట్రీ కనెక్ట్ ఇనిషియేటివ్ కింద గురువారం ఈ ఒప్పందం కుదిరింది. . ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ ఈ ఒప్పందం సాంకేతిక విద్యను పరిశ్రమల అవసరాలకు మరింత అనుగుణంగామార్చడంలో సహాయపడటంతో పాటు, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలనుకూడా విస్తరిస్తుందని అన్నారు. అదానీ స్కిల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబిన్ భౌమిక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ప్రభుత్వంతో తమ భాగస్వామ్యం రాష్ట్రంలోనే ప్రపంచ స్థాయి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉన్న మానవ వనరులను తీర్చిదిద్దే దిశలో ఒక కీలకమైన ముందడుగు అన్నారు. ఈ ఒప్పందంపై ఉన్నత విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మరియు అదానీ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధన్వ కిమ్మనే సంతకాలు చేశారు.
ఈ భాగస్వామ్యం పాలిటెక్నిక్ విద్యార్థులకు పారిశ్రామిక పద్ధతులపై మరింత అవగాహన కల్పించడంతో పాటు, ఇంటర్న్షిప్లు, శిక్షణ మరియు ఉపాధికి మెరుగైన మార్గాలను సృష్టిస్తుందని వారు పేర్కొన్నారు. ఐదేళ్లపాటు చెల్లుబాటులో ఉండే ఈ అవగాహన ఒప్పందం, నైపుణ్యం కలిగిన, పరిశ్రమకు మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పాలిటెక్నిక్ డిప్లొమా నైపుణ్యాభివృద్ధి దిశగా ఉన్నత విద్యాశాఖ, ఏఎస్ఈ మధ్య దీర్ఘకాలిక సహకారానికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదానీ స్కిల్స్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ సంబంధాల హెడ్ దీపక్కుమార్ పంచాల్, ఉన్నత విద్య జాయింట్ డైరెక్టర్ వి పద్మారావు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఏ.వి.రామకృష్ణపాల్గొన్నారు.







కామెంట్లు (0)