- రాజధానిలో పర్యటించిన మంత్రులు
ప్రజాశక్తి - తుళ్లూరు: రాజధాని అమరావతి అద్భుతమైన, నివాసయోగ్యమైన నగరంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రశంసించారు. గురువారం మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి వీరాంజనేయ స్వామి రాజధాని అమరావతిలో పర్యటించారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, ఐకానికే భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాలు, రహదారులు తదితర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాల వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. మంత్రి డోలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించాం.. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో పనులన్నీ అద్బుతంగా జరుగుతున్నాయని అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అమరావతిలో ఎమ్మెల్యేలు, మినిస్టర్ లు, సెక్రటరీల బంగళాలు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. అమరావతి అద్భుతమైన, నివాసయోగ్యమైన నగరం అవుతుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన క్వాంటం వ్యాలీని ఇక్కడ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి మొదట మూడుముక్కలాట ఆడాడు.. ఇప్పుడు మావిగన్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. రైతుల త్యాగాల వల్లనే అమరావతి నిర్మాణం ఇంత పెద్ద ఎత్తున జరుగుతోందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో 30 వేల ఎకరాలకు తక్కువ కాకుండా రాజధాని ఉండాలని మద్దతు ఇచ్చారని, తర్వాత మూడు రాజధానుల పేరుతో ప్రజల్లో అయోమయం సృష్టించారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని వచ్చి చూడాలన్నారు. అమరావతి ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని చెప్పారు.








కామెంట్లు (0)