గందరగోళం మధ్య బిల్లులు ఆమోదం
అమరావతి బ్యూరో : శాసన మండలిలో చివరి రోజు గురువారం కూడా వాయిదాల పర్వం నడిచింది. డిఎస్సిపై మండలిలో చర్చించాలని వైసిపి వాయిదా తీర్మానం అందించడం, చైర్మన్ తిరస్కరించడం, సభ్యులు ఆందోళన కొనసాగిం చడం జరిగింది. సభ్యులు ఆందోళన, గందరగోళం మధ్యనే మండలిలో పలు బిల్లులు ఎటువంటి చర్చ లేకుండా ఆమోదం పొందాయి. డిఎస్సిపై చర్చించాలని వైసిపి సభ్యులు వరుదు కళ్యాణి, రమేష్ యాదవ్, ఇసాక్ బాషా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించడంతో సభ్యులు ఆందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకొని చైర్మన్ పొడియం పైకి ఎక్కి పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్యనే 21 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాలను చైర్మన్ కొనసాగించారు. సభలో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్ధితుల్లో 10.21 సభను చైర్మన్ వాయిదా వేశారు. 10.45గంటలకు చైర్మన్ సభను ప్రారంభించిన సమయంలో కూడా వైసిపి సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ కోటాలో సభ్యురాలిగా ఎన్నికైన రమాదేవితో ప్రమాణ స్వీకారం ఉందని ఛైర్మన్ చెప్పడంతో నినాదాలు ఆపేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే మరలా వైసిపి సభ్యులు పోడియం చుట్టుముట్టి నినాదాలు మొదలుపెట్టారు. ఈ గందరగోళం మధ్య సభలో ఏం జరుగుతుందో, చైర్మన్ ఏం చెబుతున్నారో కూడా వినిపించలేదు. ఈ నేపధ్యంలోనే చైర్మన్ పలు బిల్లులను ఆమోదించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు.
10 బిల్లులు ఆమోదం
మండలిలో గురువారం 10 బిల్లులు ఆమోదం పొందాయి. ఎపి ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చట్ట సవరణ బిల్లు – 2026ను, ఎపి ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు - 2026ను, ఎపి స్టేట్ ప్రైవేట్ స్కిల్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ బిల్-2026ను, ఎపి స్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్ బిల్-2026ను, ఎపి పబ్లిక్ లైబ్రరీ సవరణ -2026 బిల్లులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టారు. ఎపి పురపాలక శాసనములు 4వ సవరణ బిల్లును మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, ఎపి ఓమ్నిబస్ (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) బిల్లును మైనార్టీ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎపి మానవ అవయవాల మార్పిడి సవరణ బిల్లు-2026ను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎపి పేమెంట్ ఆఫ్ శాలరీ పింఛన్, రిమూవల్ డిస్ క్యాలిఫికేషన్ బిల్లు 2026 తదితర బిల్లును ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టగా మండలి ఆమోదించింది.






కామెంట్లు (0)