ప్రజాశక్తి-అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఎపి మంత్రివర్గం గురువారం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో రైతులు, అమరావతి రాజధాని అభివృద్ధి, రహదారులు, రైల్వే లైన్, వరద నష్టం పునరుద్ధరణ, వైద్య, న్యాయ రంగాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు అమరావతి మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన భూసమీకరణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
తోతాపురి మామిడికి మద్దతు ధర కోసం మార్క్ఫెడ్ నిధుల అంశంపై చర్చించారు. అనంతరం రూ.281 కోట్ల నిధుల ప్రతిపాదనలకు ఆమోదం మంత్రివర్గం తెలిపింది. అలాగే పొగాకు రైతులకు డీబీటీ ద్వారా రూ.94 కోట్ల ఆర్థికసాయం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రిజర్వాయర్ కేజ్ కల్చర్ పాలసీ ముసాయిదాకు ఆమోదముద్ర వేశారు. మత్స్యరంగంలో కేజ్ కల్చర్ను ప్రోత్సహించేందుకు కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 78 వరద పునరుద్ధరణ పనులపై కేబినెట్ చర్చించింది. అనంతరం వరద నష్టం పునరుద్ధరణకు రూ.6.24 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది. వెలిగొండ టన్నెల్లో టీబీఎం తొలగింపు పనులకు రూ.11.63 కోట్ల మంజూరుపై చర్చించారు.







కామెంట్లు (0)