- నేటి నుంచి 'ఫ్యూచర్-రెడీ' రిట్రీట్
- ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్న సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సాంకేతికతలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్ నేరాలను ముందుగానే గుర్తించి సమర్థంగా ఎదుర్కొనే దిశగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరోకీలక అడుగువేస్తోంది. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను సాంకేతికంగా, సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రెండురోజులపాటు ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న 'ఫ్యూచర్-రెడీ ఎపి పోలీస్' రిట్రీట్ మంగళవారం విజయవాడలోని అంబేద్కర్ కన్వెన్షన్ హాలులో ప్రారంభం కానుంది. రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు, డిజిపి హరీష్ కుమార్ గుప్తా నాయకత్వంలో నిర్వహించనున్న ఈ రిట్రీట్లో రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులంతా పాల్గొననున్నారు.రిట్రీట్ తొలి రోజు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్ననున్నారు. 'మానవ వనరులు, సాంకేతికత ఆధారిత విధానాలు, సంస్థాగత సంస్కరణల ద్వారా భవిష్యత్ నేరాలను ఎదుర్కొనేందుకు ఎపి పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం' అనే ప్రధాన అంశంతో ఈ రిట్రీట్ నిర్వహిస్తోంది.సైబర్ నేరాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత నేరాలు, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మరింత పెంపొందించడంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.








కామెంట్లు (0)