- లండన్లో ఫాస్టర్స్ ప్రతినిధులతో మంత్రి నారాయణ చర్చ
- ఐకానిక్ భవనాల తుది డిజైన్ల సమీక్ష
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి నిర్మించనున్న అసెంబ్లీపై ఏర్పాటు చేసే ఎత్తైన టవర్ను పర్యాటక ప్రాంతంగా మార్చడంపై పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ సోమవారం ఫాస్టర్స్ ప్రతినిధులతో చర్చించారు. అలాగే ఐకానిక్ భవనాల తుది డిజైన్లపైనా సమీక్ష నిర్వహించారు. లండన్ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ బృందం అమరావతి ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. అమరావతిలో నిర్మిస్తున్న అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్ల వెలుపలి డిజైన్లుపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనుల తీరుతో పాటు, భవిష్యత్లో ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రక్రియకు సంబంధించి ఆర్కిటెక్ట్లు, కన్సల్టెన్సీ, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. అసెంబ్లీ భవనం పైభాగంలోని టవర్పై సుదీర్ఘంగా చర్చించారు. అత్యంత ఎత్తులో నిర్మించనున్న ఈ టవర్ను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించేలా డిజైన్ చేయడం, నిర్మాణ విధానాలకు సంబంధించిన అంశాలను సమావేశంలో పరిశీలించారు. ఈ టవర్ ద్వారా అమరావతి రాజధాని ప్రాంతాన్ని వీక్షించేలా టూరిస్ట్ ప్రాంతంగా రూపొందించే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా టవర్ నిర్మాణంపై ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిజైన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలను వివరించారు.అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్ల వెలుపలి డిజైన్లపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్న తీరుకు అనుగుణంగా డిజైన్ల విషయంలో అవసరమైన సూచనలను ఎప్పటికప్పుడు చేయడం, నిర్మాణ దశలను బట్టి డిజైన్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై నారాయణ కంపెనీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.








కామెంట్లు (0)