9వ రోజుకు ఎస్సి, ఎస్టి పారిశ్రామికవేత్తల దీక్షలు
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ (గుంటూరు జిల్లా) : ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన రూ.754 కోట్ల బకాయిలను విడుదల చేసే వరకు దీక్షలను విరమించేది లేదని ఎస్సి, ఎస్టి పారిశ్రామికవేత్తలు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పరిధిలోని చినకాకాని ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్సి, ఎస్టి పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ పర్సంటేజ్ విధానం వల్ల ఆర్థికంగా చితికిపోయి బ్యాంక్ వాయిదాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే తాము కొనుగోలు చేసిన వాహనాలను ఎపిఐఐసి కార్యాలయం ముందు నిలిపివేస్తామని హెచ్చరించారు. దీక్షల నేపథ్యంలో పారిశ్రామికవేత్తల ఆరోగ్యం క్షీణిస్తోంది.
ఇప్పటికే ముగ్గురికి గుండెపోటు రాగా, గత నెల 27న కంచుపర్తి వెంకట్రావు అనే పారిశ్రామికవేత్త మరణించారని, తాజాగా దీక్షలో ఉన్న తలారి క్రాంతి కుమార్ సొమ్మసిల్లి పడిపోగా, కర్నూలు నుంచి దీక్షకు వస్తున్న సేవా నాయక్ పక్షవాతానికి గురై ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ఈ సమస్యపై పారిశ్రామికవేత్తల బృందం ఇటీవల డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ను కలిసి విన్నవించగా, ఆయన పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. పరిష్కారానికి రెండు మూడు రోజులు సమయం పడుతుందని అధికారులు పేర్కొనగా, పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ రామలింగం దీక్షా శిబిరానికి వచ్చి చర్చించారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తాము నిరసనను ఆపేది లేదని తెలిపారు.







కామెంట్లు (0)