కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ జెఎసి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగును రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జెఎసి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు జెఎసి చైర్మన్ బి కాంతారావు, సెక్రటరీ జనరల్ పి వెంకటసుబ్బయ్య శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం పరిమితంగా రెగ్యులరైజేషన్ అవకాశం కల్పించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న లక్షలాది మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్టైం, డైలీ వేజ్ ఉద్యోగులు ఈ చట్టం పరిధికి బయటే ఉండిపోయారని వివరించారు. ప్రభుత్వ యంత్రాంగం సజావుగా నడవడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఉద్యోగ భద్రత, సమాన వేతనం, పెన్షన్, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర సేవా హక్కులకు నోచుకోకుండా అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి నిరంతరాయంగా ప్రభుత్వ సేవలందిస్తున్నప్పటికీ, ఇప్పటికీ తాత్కాలిక ఉద్యోగులుగానే కొనసాగడం విచారకరమని పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాయని వివరించారు. ప్రభుత్వం రాబోయే శాసనసభ సమావేశాల్లో 30/2023 చట్టానికి సమగ్ర సవరణలు చేయాలని, లేదంటే కొత్త సమగ్ర రెగ్యులరైజేషన్ చట్టాన్ని రూపొందించాలని కోరారు. తద్వారా ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ప్రభుత్వ సేవలో కొనసాగుతున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం ప్రభుత్వం చూపే దయ కాదని, వారి సేవలకు తగిన గుర్తింపు అని, రాజ్యాంగబద్ధమైన హక్కు వివరించారు. ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి తక్షణమే చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)