శ్రీనగర్ : బిజెపి చేసిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆ పార్టీకి సవాలు విసిరారు. తమ ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థను నియంత్రించడం లేదని స్పష్టం చేశారు.బుధవారం ఆయన శ్రీనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఒకవేళ బిజెపి ఆరోపణలు వాస్తవమని భావించినా, అటువంటి వాటిని దాచిపెట్టేంత శక్తి తమకు లేదని అన్నారు. తమ నియంత్రణలో పోలీసులు లేరని, క్రైమ్ బ్రాంచ్ లేదని, అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) లేదని, కనీసం ఒక్క కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా తమ ఆధీనంలో లేదని అన్నారు. నియామకాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ జమ్ములో బిజెపి చేపడుతున్న ఆందోళనను వ్యతిరేకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపితో పాటు కేంద్రం ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలు అబద్ధాలు చెబుతున్నాయని అన్నారు. నిజంగా అవినీతి జరిగితే .. కేసు నమోదు చేసి, చర్యలు చేపట్టాలని బిజెపికి సవాలు విసిరారు. అనవసరమైన గందరగోళం సృష్టించేందుకు బిజెపి ఇటువంటి ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు.
ఎన్నికమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై స్పందిస్తూ.. ఆ వాగ్దానాలన్నీ ఐదేళ్లకు ఇచ్చామని, ఒక్క ఏడాదికి మాత్రమే కాదని అన్నారు. ఒకవేళ మూడేళ్లు మరిచిపోయినా.. ఇంకా రెండేళ్లు పదవీకాలం ఉంటుందని అన్నారు. తమ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి) ప్రకటించిన మేనిఫెస్టో కేవలం ఒక్క రోజు, ఒక్క వారం, ఒక్క నెల లేదా ఒక్క సంవత్సరకాలానికి కాదని, ఇది ఐదేళ్ల రోడ్ మ్యాప్ అని అన్నారు. ఐదేళ్ల తర్వాత ఆ ప్రశ్నకు వివరంగా సమాధానమిస్తానని అన్నారు. త్వరలోనే హామీలన్ని నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
ఇటీవల అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు అయాతుల్లా ఖమేనీపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలోని కార్గిల్లో నమోదైన ఎఫ్ఐఆర్పై స్పందిస్తూ.. తనకు వివరాలు తెలియదని అన్నారు. అయినప్పటికీ.. ఏమతమైనా ఒక నేతపై అవమానకరమైన భాషనువినియోగించడం సరికాదని అన్నారు. కేవలం కార్గిల్ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షియా కమ్యూనిటీ కూడా .. ఎవరి ఇష్టాలకు ఇబ్బంది కలిగించకూడదని అన్నారు. పోలీసులు చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటారని అన్నారు.







కామెంట్లు (0)