ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ గాయని ఎస్ జానకిమ్మ మృతికి సిపిఎం రాష్ట్రకమిటీ సంతాపం ప్రకటించింది. భారతీయ సినీ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసి, కోట్లాది మంది సంగీతాభిమానులకు 'గాన కోకిల'గా నిలిచారని ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత గుంటూరు జిల్లా పల్లపట్ల నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన ఆమె, దాదాపు ఏడు దశాబ్దాల పాటు తన మధురమైన గాత్రంతో దేశ ప్రజలను మంత్రముగ్ధులను చేశారని కొనియాడారు. దాదాపు 25 భాషల్లో, 50 వేలకు పైగా పాటలు పాడి అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్న ఆమె మృతి బాధాకరమని తెలిపారు.
గవర్నర్, ముఖ్యమంత్రి సంతాపం
జానకి మృతికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. దక్షిత భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన జానకి మృతి తనకు దిగ్ర్భాంతి కలిగించిందని గవర్నర్ తెలిపారు. వివిధ బాషల్లో 50వేలకు పైగా పాటు పాడి అనేక జాతియ, రాష్ట్ర అవార్డులు అందుకున్న అద్భుతమైన నేపథ్య గాయని అని పేర్కొన్నారు. తెలుగు గడ్డ ముద్దుబిడ్డ అయిన జానకమ్మ లేరన్న వార్త తీవ్ర విచారానికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన అసాధారణ సంగీత ప్రస్థానంతో ఎన్నో తరాలను తన గానంతో ప్రజలను అలరించారని పేర్కొన్నారు. . భారతీయ సంగీతానికి ఆమె చేసిన అపారమైన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా జానకి మృతిపట్ల సంతాపం తెలిపారు.తెలుగు గాయనీమణుల్లో ఆమె ఒక ఆణిముత్యం అని పేర్కొన్నారు.







కామెంట్లు (0)