ప్రజాశక్తి-విజయవాడ : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 11న నిర్వహిస్తున్న సమ్మెకు సిపిఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రజలు ఈ సమ్మెకు సంఘీభావంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.
బ్యాంకు ఉద్యోగులు భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడుకునేందుకు, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా సమ్మె నిర్వహిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగుల పోరాటం కేవలం వారి హక్కుల కోసం మాత్రమే కాదని పేర్కొన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధానాలను అమలు చేస్తున్నదిని, ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలను మెర్జర్ల పేరిట కుదిస్తున్నదని తెలిపారు. కార్పొరేట్లు తీసుకున్న వేలాది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నదని, ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడుకునేందుకు చేస్తున్న సమ్మెకు సిపిఎం రాష్ట్ర కమిటీ మద్దతు తెలిపిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)