కమిషనర్ దగ్గర రిపోర్టు చేయాలని ఆదేశాలు
పూలింగ్ సరిగ్గా జరగడం లేదని ఆగ్రహం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎపిసిఆర్డిఎలో రెండోదశ భూ సమీకరణ పథకంలో డైరెక్టరుగా పనిచేస్తున్న బిఎల్ చెన్నకేశవరావును బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పులిచింతల భూసేకరణ పథకం అధికారిగా ఉన్న గాయత్రిదేవిని నియమించారు. ల్యాండ్ పూలింగులో అనుభవం ఉందని కోరిమరీ తెచ్చుకున్న చెన్నవేశవరావును బదిలీ చేయడం, పోస్టింగు ఇవ్వకుండా కమిషనర్ వద్ద రిపోర్టు చేయాలని ఆదేశించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నెల 22న ఆర్సి నెంబరు 143/2026 ఆదేశాలిచ్చారు. పూలింగులో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిని ఉన్న పళంగా బదిలీ చేయడంపై అధికారుల్లోనూ చర్చ జరుగుతోంది. ల్యాండ్స్ డైరెక్టరుగా ఉన్న వసంతరాయుడు కూడా స్వయంగా వెళ్లిపోయారు. నలుగురిలో ఉన్నతాధికారి తిట్టడంతో మనోవేదనకు గురై వసంతరాయుడు వెళ్లిపోయారని అప్పట్లో చర్చ జరిగింది. అలాగే రెండోదశ పూలింగుకు ఇన్ఛార్జిగా ఉన్న చెన్నకేశవరావును పనిపైనా సమీక్ష సమయంలో ఉన్నతాధికారి పనిబాగోలేదని, పూలింగు సరిగ్గా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చెన్నకేశవరావు గతంలోనే రిటైరయ్యారు.
కాంట్రాక్టు పద్ధతిలో మరలా బాధ్యతల్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం 6,400 ఎకరాల వరకూ పూలింగు పూర్తయింది. ఇంకా రావాల్సి ఉంది. అనుకున్నంత స్థాయిలో పూలింగు జరగడం లేదని ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఏడు గ్రామాల్లో కాంపిటెంట్ అథారిటీలుగా రెగ్యులర్ అధికారులే ఉన్నారు. వారు రిటైరైన చెన్నకేశవరావు మాటను లెక్కచేయడం లేదనే అభిప్రాయమూ ఉంది. దీనిపై అనేకసార్లు ఆయన కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చర్చ నడుస్తున్న సమయంలోనే సిఆర్డిఎలో ఈ నెల 8న రిపోర్టు చేసిన గాయత్రి దేవికి బాధ్యతలు అప్పగించారు.








కామెంట్లు (0)