18వ రోజుకు జంతర్ మంతర్ వద్ద మహిళా సంఘాల ఆందోళన
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు చేపట్టిన నిరంతర ధర్నా బుధవారం 18వ రోజు కొనసాగింది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన మహిళలు రౌస్ అవెన్యూ కోర్టు ముందు సమావేశమై, దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్ మీదుగా బాల్ భవన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఐద్వా ప్రధాన కార్యదర్శి కనినిక ఘోష్ మాట్లాడుతూ తమిళనాడు అసెంబ్లీలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్పై తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చర్యను స్వాగతించారు. మహిళా రిజర్వేషన్ అనేది సామాజిక న్యాయానికి సంబంధించిన అంశమని, దీనిని తక్షణమే అమలు చేసేందుకు వీలుగా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియల నుండి వేరు చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న వైఖరిని ఐద్వా, నేషనల్ కోయిలిషన్ ఫర్ ఉమెన్స్ రిజర్వేషన్ స్వాగతించాయి. ఈ కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షులు పుణ్యవతి, జగమతి సాంగ్వాన్, కార్యదర్శులు ఆశా శర్మ, సవిత, పంజాబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కవల్జీత్, ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆశా యాదవ్, ప్రధాన కార్యదర్శి కవితా శర్మ, ఉపాధ్యక్షురాలు మైమూనా, సెహబా ఫరూఖీ, అంజు ఝా తదితరులు ఉన్నారు.








కామెంట్లు (0)