- మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గిరిజన ప్రాంతాల్లో మొత్తం రూ.1,049 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గిరిజన ఇంజనీరింగ్ విభాగం పనులపై ఆమె మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐటిడిఎల వారిగా అరకు ఐటిడిఎకు రూ.257 కోట్లు, సీతంపేటకు రూ.163 కోట్లు, పార్వతీపురానికి రూ.154 కోట్లు, పాడేరుకు రూ.134 కోట్లు, రంపచోడవరానికి రూ.112 కోట్లు, శ్రీశైలానికి రూ.44 కోట్లు, చింతూరుకు రూ.34 కోట్లు, నెల్లూరుకు రూ.19 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. పిఎం జన్మాన్, డిఎ జియుజిఎ, ఎంజిఎన్ఆర్ఇజిఎ, సాస్కి పథకాల కింద మంజూరైన నిధులు, వాటి వినియోగం, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఐటిడిఎల వారీగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. మంజూరైన నిధులతో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను గడువులోగా పూర్తి చేయాలని, పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పురోగతి నివేదికలు సమర్పించాలని మంత్రి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు.








కామెంట్లు (0)