దేశవ్యాప్తంగా సర్వర్ డౌన్
ప్రజాశక్తి- విజయవాడ అర్బన్ : దేశవ్యాప్తంగా పాస్ పోర్ట్ సేవా కేంద్రాలలో సర్వర్ డౌన్ కారణంగా సేవలకు మంగళవారం తీవ్ర అంతరాయం కలిగింది. దీనిలో భాగంగా విజయవాడ పాస్పోర్ట్ సేవా కేంద్రంలోనూ సర్వర్ స్లో కావడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుండి బందరు రోడ్డులోని పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి వచ్చిన అభ్యర్థులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఉదయం 8.30 గంటలకు స్లాట్ వచ్చిన వారికి సాయంత్రం నాలుగు గంటలైనా దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాలేదు. తాము బయటకు వెళితే తమను ఎప్పుడు పిలుస్తారోనని అక్కడే గంటల తరబడి వేచి దరఖాస్తుదారులు వేచి ఉన్నారు. స్లాట్ బుకింగ్ సమయానికి అభ్యర్థులు అక్కడికి చేరుకున్నా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నెమ్మదిగా సాగింది. దీంతో, ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. అభ్యర్థులకు ఇచ్చిన స్లాట్ సమయానికి లోపలికి అనుమతించకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసరంగా పాస్పోర్టు కావాలనుకునే వారు తత్కాల్ లో స్లాట్ తీసుకున్నారు. సర్వర్ పనిచేయకపోవడంతో వారికీ ఇబ్బందులు తప్పలేదు. మంగళవారం సేవలు పొందలేని వారికి స్లాట్ ఎప్పుడనేది తర్వాత సమాచారం ఇస్తామని పాస్పోర్టు అధికారులు ప్రకటించారు.







కామెంట్లు (0)