ఆఫ్ఘనిస్తాన్కు వన్డే ప్రపంచకప్ బెర్త్..
మరోసారి అర్హత టోర్నీ ఆడనున్న విండీస్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) నిర్ణయాలపై అసోసియేట్ దేశాలు స్కాట్లాండ్, నెదర్లాండ్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయ. ఇందుకు ప్రధాన కారణం ఈ రెండు జట్లు టోర్నీకి అర్హత సాధించకపోవడమే.. ఈసారి ఆడే జట్ల సంఖ్యను 14కు పెంపు చేసినా.. ఇప్పటికే 10జట్లు అర్హత సాధించేశాయి. ఐసిసి తాజా నిబంధనలతో ఈ రెండుజట్లు మరోసారి అర్హత టోర్నీ ద్వారా పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 14వ ఐసిసి వన్డే ప్రపంచకప్కు సెప్టెంబర్ 30నాటికి ఐసిసి టాప్-8 ర్యాంకుల్లో నిలిచిన జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. దీంతో ఆతిథ్య దేశాల్లో జింబాబ్వే, దక్షిణాఫ్రికా నేరుగా బెర్త్ దక్కించుకోగా.. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక ర్యాంకింగ్స్లో టాప్-8లో నిలిచి క్వాలిఫై అయ్యాయి. ఇక ఐర్లాండ్తో సెఓమవారం జరిగిన మూడో వన్డేలో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కూడా ఐసిసి ర్యాంకింగ్స్లో 8వ ర్యాంక్కు ఎగబాకి వన్డే ప్రపంచకప్ బెర్త్ను కొట్టేసింది. దీంతో మిగిలిన 4బెర్త్లపై ఉత్కంఠ నెలకొంది. మాజీ ఛాంపియన్ వెస్టిండీస్, ఐర్లాండ్, యుఎఇ, నేపాల్తోపాటు స్కాట్లాండ్, నెదర్లాండ్స్ కూడా రేసులో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, నమీబియా వేదికలుగా 2027 ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23వరకు క్వాలిఫై టోర్నీ జరగనుంది. ఆ టోర్నీ అనంతరం చివరి 4 బెర్త్లు భర్తీ కానున్నాయి. ఇక అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21వరకు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికలుగా 14 జట్ల మధ్య మొత్తం 57మ్యాచ్లతో మెగా టోర్నీ జరగనుంది.
మరోసారి నేరుగా అర్హత సాధించని విండీస్...
ఐసిసి వన్డే ప్రపంచకప్-2027కు నేరుగా అర్హత సాధించడంలో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ మరోసారి విఫలమైంది. ఒకప్పుడు అద్భుత విజయాలతో ప్రపంచ క్రికెట్ను ఏలిన వెస్టిండీస్.. గత వన్డే ప్రపంచ కప్నకూ నేరుగా అర్హత సాధించలేదు. ఆ తర్వాత క్వాలిఫయర్స్లోనూ నిరాశపరిచి ఏకంగా మెగా టోర్నమెంట్కు దూరమైంది. ఈసారి కూడా విండీస్ అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐర్లాండ్పై అఫ్గానిస్థాన్ విజయం సాధించి ప్రపంచ కప్నకు కావల్సినన్ని పాయింట్లు సాధించి అర్హత సాధించడంతో విండీస్ ఆశలు ఆవిరయ్యాయి.






కామెంట్లు (0)