ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి : గాదె సాయికృష్ణ లాకప్ డెత్పై సిబిఐ దర్యాప్తు కోరుతూ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై హైకోర్టు స్పందించింది. సిబిఐ దర్యాప్తుపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ల ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ ఆచూకీ తెలియడం లేదని, అతన్ని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి మొట్టమొదటిగా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సాయికృష్ణ లాకప్లో మృతి చెందినట్లు తేలడంతో దీనిపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు రాగా, విజయలక్ష్మి తరఫు న్యాయవాది కోగంటి రిత్విక వాదనలు వినిపించారు. హెబియస్ కార్పస్ పిటిషన్పై ప్రభుత్వం చేసిన కౌంటర్కు రిప్లై దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. సాయికృష్ణ లాకప్ డెత్పై సిబిఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జిపి) సింగమనేని ప్రణతిని ధర్మాసనం ప్రశ్నించగా, సిబిఐ దర్యాప్తు అంశంపై కౌంటర్ దాఖలు చేయలేదని సమాధానం ఇచ్చారు. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.







కామెంట్లు (0)