- మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు
- జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడిన సిఎం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీ కొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో మాట్లాడారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించగా... నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని సిఎం ఆదేశించారు. ప్రియాంకకు ప్రమాదం జరిగిన అనంతరం రాజమండ్రిలో చికిత్స అందించడం, తరువాత కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయాన్ని అధికారులు వివరించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. అదే విధంగా బాధిత కుటుంబానికి ఇతరత్రా అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని తెలిపారు.








కామెంట్లు (0)