- జనసేన పార్లమెంటరీ సమావేశంలో పవన్ కళ్యాణ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపై గళం వినిపించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఎంపిలకు దిశానిర్దేశం చేశారు.హైదరాబాద్లోని పవన్ నివాసంలో జనసేన పార్లమెంటరీ సమావేశం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన శనివారం జరిగింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని పవన్ ఈ సందర్భంగా ఎంపిలకు చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు. రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు చేకూరేలా ప్రతి అంశంపై సమగ్ర అవగాహనతో మాట్లాడాలని సూచించారు. ప్రతి అంశంలోనూ ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు.దేశ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల సాధనే జనసేన పార్టీ లక్ష్యమని, అదే దిశగా పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అంశాలను బలంగా వినిపించాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఎంపిలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, లింగమనేని రమేష్ పాల్గొన్నారు.








కామెంట్లు (0)