- పోలీసుల చిత్రహింసల వల్లే మృతి : అండ్ర మాల్యాద్రి
- మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శ
ప్రజాశక్తి -తాడికొండ (గుంటూరుజల్లా) : దొంగతనం కేసు విచారణ పేరుతో తాడికొండ పోలీసుల చిత్రహింసలవల్లే చీకటి గోపి మృతి చెందాడని, ముమ్మాటికీ ఆయనది పోలీసుల హత్యేనని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో గోపి కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా మాల్యాద్రి మాట్లాడుతూ దొంగతనం కేసులో విచారణ పేరుతో పోలీసులు స్టేషన్ కి పిలిచి కొట్టడం వల్లే గోపి మృతి చెందారని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని, గోపి మృతికి కారణమైన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్వతంత్ర సంస్థతో విచారణ చేయాలి : సిపిఎం, కెవిపిఎస్
గోపి మృతిపై స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలని సిపిఎం, కెవిపిఎస్ డిమాండ్ చేశాయి. పొన్నెకల్లులోని మృతుడు గోపి ఇంటి వద్ద ఆయన భార్య జ్యోతిని, కుటుంబ సభ్యులను సిపిఎం, కెవిపిఎస్ నాయకులు పరామర్శించారు. గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ అమానుషంగా పోలీసులు కొట్టడం వల్లే గోపి చనిపోయాడని కుటుంబీకులు తెలిపారన్నారు. ఆటో నడిపితే తప్ప కుటుంబం గడవని పరిస్థితిల్లో కుటుంబ పెద్ద పోగొట్టుకొని ఇద్దరు పిల్లలు దిక్కులేని వారైపోయారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసుల చేతే విచారణ జరపడం దొంగపై దొంగే విచారణ చేసిన చందంగా ఉందన్నారు. స్వతంత్రమైన సంస్థ ద్వారా విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, సొంత ఇల్లు కూడా లేని గోపి కుటుంబానికి ప్రభుత్వం మూడు సెంట్లు స్థలం కేటాయించి, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, గోపి భార్యకి ఉద్యోగం, పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో గోపి మృతిపై వార్తలు వస్తున్నా, చర్చ జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచనీయమన్నారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జె నవీన్ ప్రకాష్ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతూనే విచారణ పేరుతో చనిపోయే వరకు కొట్టడం ఎంత వరకూ న్యాయమని ప్రశ్నించారు. కులం ఆధారంగా దళితులు గిరిజనులపై నేరాలను నిర్ధారించి విచారించడం ఏ చట్టం ఆమోదిస్తుందని ప్రశ్నించారు. తెనాలిలో ముగ్గురు యువకులతో మొదలైన పోలీస్ దాడులు మంగళగిరిలో గిరిజన యువకులపై ఆ తర్వాత తాడికొండ వరకు కొనసాగాయన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)