గోవా గవర్నర్, మంత్రి కొండపల్లి, కలిశెట్టి హాజరు
అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి : గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
ప్రజాశక్తి- విజయనగరం టౌన్ : విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమం గురువారం జరిగింది. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎంఎస్ఎంఇ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పి ఎఆర్.దామోదర్, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పూసపాటి వంశీయులు, పలువురు ప్రముఖులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శిరీష పర్యవేక్షణలో సింహాచలం దేవస్థానం ఆగమ పాఠశాల శైవాగమ పండితులు కాళ్లకూరి సుబ్రమణ్యశర్మ ఆధ్వర్యంలో వేదపండింతులు ఈ క్రతువును పూర్తిచేశారు. ఆలయ విస్తరణ అనంతరం అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టా కార్యక్రమం పూర్తికావడంతో, మధ్యాహ్నం నుంచి సాధారణ యాత్రికులను అనుమతించారు. ఈ సందర్భంగా అశోక్గజపతిరాజు మాట్లాడుతూ... అమ్మవారి ఆలయ విస్తరణ పనులు విజయవంతంగా పూర్తయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... ఆలయ విస్తరణ పనులను ఆరునెలల్లోనే పూర్తి చేయడం పట్ల అభినందించారు. ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎంఎల్ఎ అదితి గజపతిరాజు మాట్లాడుతూ... ఆలయం వద్దనున్న ఖాళీ స్థలంలో యాత్రిలకు అవసరమైన వసతులను కల్పించనున్నట్లు తెలిపారు.









కామెంట్లు (0)