ప్రజాశక్తి-విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం తెల్లవారుజాము నుంచే విజయవాడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు యానాంలో వచ్చే మూడు గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఇదిలా ఉండగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వచ్చే మూడు గంటల్లో ఈ జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి ఉరుములు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని హెచ్చరించారు.







కామెంట్లు (0)