మొత్తం రూ.41,187 కోట్లు
అసెంబ్లీలో నివేదిక
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోంది. ఇప్పటి వరకూ వివిధ బ్యాంకులు, వేర్వేరు సంస్థల నుండి రూ.41,187 కోట్లు తీసుకునేందుకు అనుమతి పొందింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.16,566 కోట్లు విడుదలయ్యాయి. మొత్తం అమరావతికి నిధుల విడుదలకు సంబంధించి అసెంబ్లీలో విడుదల చేసిన నివేదికతో పాటు అప్పుల నివేదిక కూడా జతపరిచారు. .అయితే సిఎంకు సమర్పించిన విషయాల్లో రూ.11,395 కోట్లు ఇచ్చినట్లు చూపించిన అధికారులు అసెంబ్లీకి ఇచ్చిన నివేదికలో మాత్రం రూ.12,731 కోట్లు చెల్లించినట్లు చూపించారు. అంటే 20 రోజుల వ్యవధిలోనే రూ.1,336 కోట్లు అదనంగా చెల్లించినట్లు పేర్కొన్నారు. ఒకవైపు పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని చెబుతూనే మరోవైపు చెల్లింపులు మాత్రం వేగంగా చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వరల్డ్ బ్యాంకు రూ.15,000 కోట్లు మంజూరు చేయగా దీనిలో రూ.7716.86 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయగా సిఆర్డిఏ పిడి ఎకౌంట్కు రూ.5,600 కోట్లు చేరాయి. ఇందులో కాంట్రాక్టర్లకు రూ.2,005.61 కోట్లు, మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.1297.66 కోఉట్ల, పిఎంసికి రూ.20.11 కోట్లు విడుదల చేశారు. జూన్ నాటికి రూ.199.57 కోట్లు వేర్వేరు బిల్లులు చెల్లించారు. మొత్తంగా రూ.3,323.38 కోట్లు వరల్డ్ బ్యాంకు నిధులు ఖర్చు చేశారు. హడ్కో నుండి రూ.11 వేల కోట్ల అప్పునకు ఆమోదం పొందారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,050 కోట్లు విడుదలవగా సిఆర్డిఏకు రూ.3,000 కోట్లు ఇచ్చారు. ఇందులోనూ మొబిలైజేషన్ అడ్వాన్స్లు రూ.1,826.71 కోట్లు ఇచ్చారు. మొత్తంగా రూ.2,805.80 కోట్లు బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. నబార్డు నుండి రూ.7,387 కోట్లు అప్పులు తీసుకునేందుకు అనుమతి పొందారు. ఇందులో రూ.2,500 కోట్లు విడుదల చేయగా సిఆర్డిఏకు రూ.2400 కోట్లు అందాయి. ఇందులో కాంట్రాక్టర్లకు రూ.1,545 కోట్లు, మొబిలైజేషన్ అడ్వాన్సులు రూ.599.21 కోట్లు ఇచ్చారు. మొత్తంగా రూ.2,294.68 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపుల నుండి రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు విడుదల చేసింది. ఇందులోనూ మొబిలైజేషన్ అడ్వాన్సులు రూ.453.16 కోట్లు చెల్లించారు. మొత్తం రూ.999.87 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్ఏబిఎఫ్ఐడి నుండి రూ.7500 కోట్లకుగాను రూ.2000 కోట్లు ప్రభుత్వానికి రాగా అందులో రూ.1750 కోట్లు సిఆర్డిఏకు ఇవ్వగా రూ.1,741.42 కోట్లు బిల్లులు చెల్లించారు. సొంత నిధుల్లో నుండి రూ.86 కోట్లు అడ్వాన్సుల కింద చెల్లించారు. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి రూ.300 కోట్లు అప్పు తీసుకున్నారు. దీనిలో రూ.143 కోట్లు యాన్యుటీ కింద చెల్లించారు. మొత్తంగా అమరావతి రాజధాని కోసం రూ.41,187 కోట్లు అప్పులు తీసుకోగా ఇందులో రూ.14,050 కోట్లు సిఆర్డిఏకు అందాయి. వీటిల్లో యాన్యుటీ కింద రూ.392.49 కోట్లు, కాంట్రాక్టర్లకు రూ.5487.65 కోట్లు, వడ్డీలకు రూ.357.77 కోట్లు చెల్లించారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ.4386.18 కోట్లు ఇచ్చారు. పాత బిల్లులు రూ.518.81 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. విడుదలైన మొత్తం నిధుల్లో రూ.252.62 కోట్లు ప్రొగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలకు ఇచ్చారు. మొత్తంగా రూ.11,395.53 కోట్ల బిల్లులు చెల్లించినట్లు ఇటీవల సిఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అధికారులు, అసెంబ్లీకి ఇచ్చిన లెక్కల్లో మాత్రం రూ.12,731 కోట్లు చెల్లించినట్లు పేర్కొనడం విశేషం.







కామెంట్లు (0)