నినాదాలతో హోరెత్తిన రైతాంగ ప్రదర్శన
ఏలూరులో అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభల ప్రారంభం
భారీ రైతు మహాప్రదర్శన.. నినాదాలతో మార్మోగిన ఏలూరు నగరం
పాల్గొన్న వేలాదిమంది రైతులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, సిటీ : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం ఏలూరులో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రైతు మహా ప్రదర్శనకు రాష్ట్రం, జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఏలూరులోని జూట్ మిల్లు నుంచి ఇండోర్ స్టేడియం వరకు సాగిన భారీ ర్యాలీ ఎర్రజెండాలు, నినాదాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
ర్యాలీలో రైతులు అరటి మొక్కలు, పొగాకు బెరళ్లు, కోకో పంట నమూనాలను ప్రదర్శిస్తూ వ్యవసాయ రంగ ప్రాధాన్యతను చాటిచెప్పారు. భాష్యం స్కూల్ విద్యార్థులచే కోలాటాలు, జానపద నృత్యాలు ప్రదర్శించగా, డప్పు కళాకారుల విన్యాసాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "హలో హలో రైతన్న... చలో చలో ఏలూరు", "జయప్రదం చేయండి రాష్ట్ర రైతు మహాసభలను" వంటి నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా ముందుకు సాగింది.
ఈ మహాప్రదర్శనలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. బలరాం, నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకుడు మంతెన సీతారాం, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏలూరు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ప్రతిబింబించేలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, మద్దతు ధరలకు గ్యారంటీ చట్టం తీసుకురావాలని, రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, వ్యవసాయ రంగానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు రాయితీలు కాకుండా రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. అలాగే వ్యవసాయ విద్యుత్కు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ఎరువులు, పురుగుమందులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నినాదించారు. "వ్యవసాయాన్ని కాపాడండి – రైతులను రక్షించండి", "కార్మిక–కర్షకుల ఐక్యత వర్ధిల్లాలి", "పోరాడుదాం... రైతాంగ సమస్యలపై పోరాడుదాం" అంటూ రైతులు తమ ఐక్యతను చాటిచెప్పారు. రైతాంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు స్పష్టమైన వ్యవసాయ విధానాలు అవలంబించాలని, రైతుల ఆత్మహత్యలు నివారించాలంటే వ్యవసాయానికి రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో రైతులు పాల్గొనడంతో ఏలూరు నగరంలో ఎక్కడ చూసినా ఎర్రజెండాలు రెపరెపలాడుతూ, రైతు నినాదాలతో మహాప్రదర్శన ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

మహాసభ దృశ్యాలు, మాట్లాడుతున్న నేతలు..


మహాసభ దృశ్యాలు, మాట్లాడుతున్న నేతలు..

మహాసభ దృశ్యాలు, ..

మహాసభ దృశ్యాలు, మాట్లాడుతున్న నేతలు..








కామెంట్లు (0)