పారిస్ : జూన్ నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలకు, వడగాల్పులకు ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియంలలో ఒక్క వారంలోనే అంతకుముందు మరణాల కంటే 3,700 అదనపు మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. జూన్ 20 నుండి 28 వరకు యూరప్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు అత్యంత తీవ్రమైనవి. వీటివల్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగిందని, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు కుప్పకూలాయని నిపుణులు తెలిపారు. వాతావరణ మార్పుల వల్లే ఇంత తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని శాస్ర్తవేత్తలు అభిప్రాయపడ్డారు.
కాగా, తీవ్రమైన వడగాలుకు ఫ్రాన్స్లో 2,025 అదనపు మరణాలు నమోదయ్యాయని, ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారిలో మరణాల సంఖ్య పెరిగిందని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ మంత్రి స్టెఫానీ రిస్ట్ శుక్రవారం స్థానిక టెలివిజన్కు తెలిపారు. అంతకుముందు వారంతో పోల్చితే జూన్ 22-28 వారంలోనే వడగాల్పులకు మరణించిన వారి శాతం 91 శాతం పెరిగింది. అలాగే నర్సింగ్ హోమ్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో కూడా మరణాలు పెరిగాయని ఫ్రాన్స్ ప్రజాఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ పేర్కొంది. ప్రాథమికంగా అంచనా వేసిన గణాంకాల కంటే.. అత్యధిక మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రజారోగ్యశాఖ తెలిపింది.
బెల్జియంలో జూన్ 18 - జూన్ 29 తేదీల మధ్య సుమారు 1,200 అదనపు మరణాలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. వీటిలో 85 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 530 మంది మరణించారని, 65 ఏళ్లలోపు వారు 180 మంది చనిపోయారని, ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక నెదర్లాండ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తీవ్రమైన వేడిగాలుల కారణంగా సుమారు 480 అదనపు మరణాలు సంభవించాయి. వీటిలో ప్రధానంగా 80 ఏళ్లు పైబడినవారే ఉన్నారని అధికారులు తెలిపారు.







కామెంట్లు (0)