ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీ విధానాన్ని నిర్వీర్యం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆక్వా రైతుల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆక్వా ప్రాంతాన్ని ఆక్వా, నాన్ ఆక్వా జోన్లుగా విభజించి వేలాది మంది రైతులను విద్యుత్ సబ్సిడీకి దూరం చేశారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగన్ తీసుకొచ్చిన ఈ విధానంతోనే ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని సరిదిద్దుతూ అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
రొయ్యల మద్దతు ధరను తగ్గించింది వైసిపినే: మంతెన రామరాజు
రొయ్యల రైతుకు వైసిపి ప్రభుత్వమే మద్దతు ధరను తగ్గించిందని ఎపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు విమర్శించారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసిపి హయాంలో జోన్లు, జె-ట్యాక్స్ పేరుతో ఆక్వా రైతుపై భారాలు మోపితే తమ కూటమి ప్రభుత్వం అండగా నిలిచి ఆక్వా రంగానికి ఊతమిస్తోందని తెలిపారు.







కామెంట్లు (0)