- టిడిపి అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మద్యం కుంభకోణంలో మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో అరెస్టు కావడం ఖాయమని టిడిపి అధికార ప్రతినిధి, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్య రావు అన్నారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వేల కోట్ల ఈ కుంభకోణానికి జగన్ ప్రధాన సూత్రధారి, పాత్రధారి, నేర వ్యూహకర్త అని విమర్శించారు.జగన్ ఆదేశాలు, పాత్ర లేకుండా ఇంతటి భారీ మద్యం కుంభకోణం సాధ్యం కాదని, ఆయన అండతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయ సాయిరెడ్డి, కారుమూరి వంటి నేతలు ఈ దోపిడీలో పాలుపంచుకున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే దాదాపు 52 మంది అరెస్ట్ అయ్యారని తెలిపారు. రాజ్ కసిరెడ్డి అరెస్ట్ తర్వాత అసలు రంగు బయటపడిందని, చివరికి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమని పేర్కొన్నారు. మద్యం వ్యాపారంలో డిజిటల్ పేమెంట్స్ లేకుండా, కేవలం నగదు మాత్రమే తీసుకోవాలని పక్కా ప్లాన్ చేసి వేల కోట్ల రూపాయలను తాడేపల్లిలోని జగన్ ఇంటికి చేర్చారని తెలిపారు.ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వమే వ్యాపారం చేస్తే పారదర్శకంగా ఉంటుందని ప్రజలను నమ్మబలికి, ప్రభుత్వ ముసుగులో మద్యం మాఫియాను జగన్ నడిపారని ఆరోపించారు. మద్యం ద్వారా సంపాదించిన అక్రమ సొమ్ముతో దుబాయ్, దక్షిణాఫ్రికా దేశాలకు షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారని పేర్కొన్నారు. ఆ డబ్బుతో టాంజానియా, జింబాబ్వేలలో మైనింగ్ వ్యాపారాలు చేస్తూ ఇక్కడ సినిమాలు, రియల్ ఎస్టేట్, బంగారం కొనుగోళ్లు చేపట్టారని తెలిపారు. .









కామెంట్లు (0)