కొలంబో : శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు ముందు టీమ్ ఇండియా ప్లేయర్లకు మంచి ప్రాక్టీస్ లభించింది. శ్రీలంక ఎలెవన్తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడోరోజు లంక జట్టు రెండో ఇన్నింగ్స్ను 200/6 వద్ద డిక్లేర్ చేసి భారత్కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ను టీమ్ ఇండియా 44.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆట ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. సిరాజ్ (32, 15 బంతుల్లో) వరుసగా మూడు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు.
తొలి ఇన్నింగ్స్లో డకౌటైన యశస్వి జైస్వాల్ (61 రిటైర్డ్ హర్ట్; 46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు) ఈ సారి అర్ధ శతకంతో మెరిశాడు. చేతి వేలికి గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగని కెప్టెన్ శుభ్మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. క్రీజులో సౌకర్యవంతంగా కనిపించిన గిల్ (44; 54 బంతుల్లో 7 ఫోర్లు) చక్కటి షాట్లు ఆడాడు. రిషభ్ పంత్ (28), రవీంద్ర జడేజా (22 రిటైర్డ్ హర్ట్), ధ్రువ్ జురెల్ (17) పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక ఎలెవన్ 363/8 చేయగా, టీమ్ ఇండియా 357/6 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.







కామెంట్లు (0)