రాజధానిలో జగన్నాథ రథయాత్రలో సిఎం చంద్రబాబు ఆకాంక్ష
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి/తుళ్లూరు : అమరావతి నగరం ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలని సిఎం చంద్రబాబు ఆకాంక్షించారు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో గురువారం ఆయన జగన్నాథుడి రథయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు... అమరావతి రాజధాని నగర బృహత్ ప్రణాళికతో కూడిన చిత్రపటాన్ని శిరస్సుపై ధరించి విశ్వనగరిగా అమరావతి ఆవిర్భవించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మానవ సంబంధాలు తగ్గి సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావం పడుతోందని, కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలు, చిన్నారులపై అఘాయిత్యాల లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఉమ్మడి కుటుంబాలు రావాలని, మైక్రో ఫ్యామిలీలు వద్దని అన్నారు. జగన్నాథ రథయాత్రను అమరావతిలో తొలిసారి నిర్వహించటంపై సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐదు వేల శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పి.నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)