- సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ‘బడ్లావ్ జరూరీ హై’ నినాదంతో దేశవ్యాప్త పోరాటాలకు సిపిఐ సమరశంఖం పూరించిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. ఆదివారం గుంటూరుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... డిసెంబరు 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 12 ఏళ్ల మోడీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. నిత్యావసర ధరలు పెరిగిపోవడం, రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం, దేశంలో మత ఉన్మాదాన్ని పెంచే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. మెడికల్ సీట్ల కేటాయింపులో రిజర్వేషన్ తరగతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ తరగతులకు విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి నడ్డి విరుస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. విలేకర్ల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాలాద్రి తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)