సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి
ప్రజాశక్తి–తిరుపతి టౌన్: బ్యాంకు ఉద్యోగులు, అధికారులు చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) పిలుపు మేరకు సెప్టెంబర్ 11న నిర్వహిస్తున్న సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకుల పనితీరు ఆధారంగా ఉద్యోగులకు చెల్లించే ప్రోత్సాహకాలను ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ఉద్యోగులందరికీ అందించాలని మురళి డిమాండ్ చేశారు. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేసేందుకు యూఎఫ్బీయూ, బ్యాంకు యాజమాన్యాల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించకపోవడం అన్యాయమన్నారు. ఈ ఒప్పందాన్ని వెంటనే ఆమోదించి అమలు చేయాలని కోరారు. యూఎఫ్బీయూ, బ్యాంకు యాజమాన్యాల సంఘాలతో సెంట్రల్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతోనే ఉద్యోగులు సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని విమర్శించారు.
బ్యాంకు ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేయడంతోపాటు ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేయాలని కోరారు. బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఐక్యంగా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని మురళి కోరారు. కార్మిక, ప్రజా సంఘాలతోపాటు బ్యాంకు ఖాతాదారులు, ప్రజలు సమ్మెకు మద్దతు తెలిపి ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సంఘీభావంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.







కామెంట్లు (0)