1,086 మెట్రిక్ టన్నుల సరుకు చోరీ.. పది మంది అరెస్ట్
ప్రజాశక్తి, విశాఖ కలెక్టరేట్: విశాఖపట్నం పోర్టులో భారీగా మాంగనీస్ చోరీకి పాల్పడిన కేసులో పది మంది నిందితులను హార్బర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.80 లక్షల విలువైన 500 మెట్రిక్ టన్నుల మాంగనీస్, రూ.35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు హార్బర్ స్టేషన్ సీఐ కె. మల్లేశ్వరరావు తెలిపారు.
ఫిబ్రవరిలో ‘ఎంవీటీ ప్రైమ్’ నౌక ద్వారా పోర్టుకు 26,400 మెట్రిక్ టన్నుల మాంగనీస్ చేరింది. దీనిని ఎస్ స్టాక్యార్డులో నిల్వ చేసి, మార్చి నుంచి ఆగస్టు మధ్య అచ్యుతాపురం ఎస్ఈజెడ్లోని అభిజిత్ కంపెనీకి తరలించారు. ఈ క్రమంలో 1,086 మెట్రిక్ టన్నుల మాంగనీస్ మాయమైనట్లు గుర్తించారు. దీంతో సంస్థ డైరెక్టర్ నామ మనోహర్ శ్రీరామచంద్ర ప్రసాద్ ఈ నెల 2న హార్బర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో సంస్థ సూపర్వైజర్లు దుర్గాప్రసాద్, రామ్కుమార్, మరో సంస్థ సూపర్వైజర్ జగదీష్ కలిసి మాంగనీస్ను కొందరికి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పలువురి చేతులు మారి ఇతర రాష్ట్రాలకు కూడా సరుకు తరలించినట్లు తేల్చారు. కేసులో పది మందిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన సరుకులో కొంత భాగాన్ని, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.







కామెంట్లు (0)