- అక్టోబర్ 2న విజయవాడలో భారీస్థాయిలో నిర్వహణ
అమరావతి: స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న విజయవాడలో భారీ స్థాయిలో నిర్వహించే స్వచ్ఛతాన్ పోస్టర్ ని మానవ వనరుల అభివృద్ధి, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని కరకట్ట పక్కన గల తమ నివాసంలో ఆవిష్కరించారు. స్వచ్ఛతా రన్లో పాల్గొనేవారు తమ పేర్లను రిజిస్టర్ చేసుకునేందుకు అమరావతిరన్నర్స్.కామ్(amaravatirunners.com) పోర్టల్ని కూడా మంత్రి లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఈ ఈవెంట్ నిర్వహించే అమరావతిరన్నర్స్ అధ్యక్షులు రమేష్ రావి, వారి బృందం సభ్యులు పాల్గొన్నారు.
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియమ్ వద్ద ఆ రోజు ఉదయం 5 గంటలకు స్వచ్ఛతా రన్ ప్రారంభమవుతుంది. 5కే, 10కే, 21.1కే (ఆఫ్ మేరాతన్) మూడు కేటగిరీలలో ఈ రన్ ని ‘అమరావతి రన్నర్స్’ వారు నిర్వహిస్తారు. బాలురు, బాలికలు, యువత ... అన్ని వయసుల వారు పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు.
పాల్గొనేవారికి టీషర్ట్స్ తోపాటు బ్రేక్ ఫాస్ట్ కూడా ఏర్పాటు చేస్తారు.
అన్ని విభాగాలలో విజేతలకు దాదాపు రూ.10 లక్షల విలువైన బహుమతులతోపాటు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేస్తారు. పాల్గొన్నవారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేస్తారు. ఈ రన్ లో పాల్గొనేవారు ఈ నెల 20వ తేదీ లోపల తమ పేర్లను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి. రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 10 వేల మంది స్వచ్ఛతా రన్లో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు వారికి ఆరోగ్యకరమైన జీవనశైలి, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవిధంగా ప్రోత్సహిస్తారు. విజయవాడలోనే ఇటువంటి రన్ నిర్వహించడం విద్యార్థులకు, యువతకు మంచి అవకాశంగా భావిస్తున్నారు.








కామెంట్లు (0)