- వారంరోజుల పర్యటనలో 50కి పైగా కంపెనీలతో పెట్టుబడి చర్చలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్య,ఐటీ, ఎలక్ర్టానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన శనివారంతో ముగిసింది. భారత్ – కొరియా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా (సౌత్ కొరియా) ఆహ్వానం మేరకు ఈ నెల 5వ తేది నుంచి చేపట్టిన ఈ పర్యటన విజయవంతమైందని లోకేష్ కార్యాలయం శనివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. మంత్రి లోకేష్ బృందానికి దక్షిణ కొరియా ప్రభుత్వంతోపాటు అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి సముచిత గౌరవం లభించిందని పేర్కొంది. ఎల్జీ వంటి గ్లోబల్ కంపెనీలు ప్రత్యేకంగా తమ హెడ్ క్వార్టర్స్ కు ఆహ్వానించి ఉన్నతస్థాయి బృందంతో గౌరవార్థ విందు ఇవ్వడం మంత్రి లోకేష్కు దక్కిన అరుదైన గౌరవం అని తెలిపింది. ఈనెల 5నుంచి 11వ తేది వరకు నిర్వహించిన అధికారిక పర్యటనలో 50కి పైగా కార్పోరేట్ సంస్థల నాయకత్వాన్ని కలిసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని లోకేష్ కోరినట్లు వెల్లడించింది. తొలిరోజు సియోల్లో తెలుగు ప్రజలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంతో ప్రారంభమైన పర్యటన శుక్రవారం సిసి ఆధ్వర్యాన పెట్టుబడిదారులతో నిర్వహించిన రోడ్ షోతో ముగిసిందని పేర్కొంది.
రాష్ట్రంతో ద్వైపాక్షిక, రాజకీయ, వాణిజ్య సహకారాన్ని బలోపేతం ప్రాధాన్యతను గుర్తిస్తూ, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి లోకేష్ను అధికారికంగా ఈ పర్యటనకు ఆహ్వానించిందని తెలిపింది. లోకేష్ తో నిర్వహించిన భేటీల అనంతరం ఎల్జీ, హ్యుందయ్, శాంసంగ్, బీఎన్ కే ఫైనాన్షియల్ వంటి కొరియన్ కార్పోరేట్ సంస్థలు తమ ఉన్నత నాయకత్వంతో సంప్రదించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చాయని వెల్లడించింది. లోకేష్ బృందం పర్యటనపై కోట్రా దక్షిణాసియా విభాగాధిపతి క్యుంగ్హూన్ కిమ్ ప్రశంసల వర్షం కురిపిస్తూ లోకేష్ బృందానికి హ్యాట్సాఫ్ అంటూ ట్విట్టర్ లో అభినందనలు తెలపడం పర్యటన విజయవంతానికి నిదర్శనమని పేర్కొంది. కొరియన్ ప్రతినిధులు మంత్రి లోకేష్ వేగం చూసి పల్లి(త్వరగా),,,పల్లి మంత్రి అని కొత్త పేరు పెట్టారని వెల్లడించింది.








కామెంట్లు (0)