15 శాతం వృద్ధి రేటు లక్ష్యమన్న సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్వర్ణాంధ్ర-2047 విజన్లో భాగంగా 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో 13.5 శాతం మేర కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సిఎజిఆర్) సాధించామని.. వివిధ కారణాల వల్ల ప్రస్తుతం 11 శాతం మేర వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రణాళికా విభాగం-కెఆర్ఇఎ యూనివర్సిటీ ఆధ్వర్యాన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు రీసెర్చ్ మధ్య అవగాహన ఒప్పందం సోమవారం కుదిరింది. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై ఈ ఎంఒయు కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, ఐఎఫ్ఎంఆర్ సంస్థ ప్రతినిధి కపిల్ విశ్వనాథన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, వృద్ధిరేటు సాధనలో 10 సూత్రాల మిషన్ సెల్స్ ఏర్పాటుతోపాటు కార్యక్రమం అమలుపై ఐఎఫ్ఎంఆర్ సంస్థ పర్యవేక్షణ చేయనుంది. జీరో పావర్టీ మిషన్, వాటర్ సెక్యూరిటీ, డీప్ టెక్ మిషన్లపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు రీసెర్చి సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో పనిచేయనుంది. ఈ ఒప్పందంలో భాగంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం, విధాన పరమైన సూచనలు అందిస్తుంది. ఈ 10 సూత్రాలకు సంబంధించి కొత్త పద్దతులకు సిఫార్సు చేస్తుంది. తదుపరి దశల్లో మిగిలిన అంశాలపై పనిచేయాలని నిర్ణయించారు. 10 సూత్రాల అమలుపై రాష్ట్రస్థాయి కమిటీతో పాటు మిషన్ వర్కింగ్ గ్రూప్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు డీప్ టెక్ను ఇంటిగ్రేషన్ చేస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఎఐ స్కిల్లింగ్, డ్రోన్ మ్యాపింగ్ ఆటోమొబైల్, మెటల్స్, స్టీల్, రేర్ ఎర్త్ మినరల్స్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ లాంటి రంగాల్లో ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఎఐ, క్వాంటం టెక్నాలజీని రాష్ట్రంలో పెద్దయెత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, కెఆర్ఇఎ, ఐఎఫ్ఎమ్ఆర్ ప్రతినిధులు, ప్రణాళికా విభాగం అధికారులు హాజరయ్యారు.









కామెంట్లు (0)