- ఆక్వా రైతు బ్రతుకు పోరాటం సభలో రాష్ట్ర అధ్యక్షుడు గాంధీభగవాన్ రాజ్
ప్రజాశక్తి - అమలాపురం : ఆక్వా రంగాన్ని నమ్ముకున్న రైతులను నష్టాల ఊబిలోకి నెడుతున్న స్థిరీకరణ లేని ధరల పెంపుదలపై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆక్వా రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజు అన్నారు. ఈ నెలాఖరులోగా మేతల తయారీదారుల నుంచి సానుకూల నిర్ణయం వెలువడకుంటే ఆయా కంపెనీలకు చెందిన మేతల కొనుగోళ్లు నిలిపివేయాలని, వచ్చే ఏడాది నాటికి పంటకాలం పూర్తిచేసుకుని తరువాత పంట విరామం ప్రకటించాలన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సోమవారం 'ఆక్వారైతు బతుకు పోరాట సభ`ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఆక్వా రైతు సంఘ నాయకులు, రైతులు భారీగా తరలివచ్చారు. తొలుత వై జంక్షన్ నుంచి సభావేదిక వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆక్వారైతు సంఘ అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబు రాజు అధ్యక్షతన జరిగిన సభలో గాంధీ భగవాన్ రాజు మాట్లాడారు. ఆక్వా రంగంలో సీడ్ దశ నుంచి రొయ్యల ఎగుమతి వరకు ఆక్వా రైతులు దగా పడుతున్నారన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ రైతుల వద్ద తక్కువకు కొనుగోలు చేస్తున్నారని, రైతులకు న్యాయం జరిగేలా కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఆక్వారంగంలో తిష్టవేసిన సిండికేట్, దళారీ వ్యవస్థలను రూపుమాపాలని కోరారు. ఆక్వా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి నాగభూషణం మాట్లాడుతూ ఆక్వాలో సిండికేట్ వ్యవస్థను నిర్మూలించాలన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మాణాలను ఏకగ్రీవంగా సభ ఆమోదించింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఈదరి యశ్వంత్ కుమార్, ముదునూరి శ్రీహరి వర్మ, దాట్ల పృథ్వీరాజు పాల్గొన్నారు.
తీర్మానాలు
• ఫీడ్ ధరలు తగ్గించుకుంటే 30వ తేదీ తరువాత ఆ ఫీడ్ కంపెనీలను బ్యాన్ చేస్తాం
• జిఒ 57లో ఉన్న పవర్ ఫ్యాక్టర్ నిబంధన తొలగించాలి
• ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ సబ్సిడీ కల్పించాలి
• విద్యుత్ కనెక్షన్లలో లోపాలను సరిదిద్దుకోవడానికి సమయం ఇవ్వాలి
• ధరల విషయంలో ఉన్న అస్థిరతను సరిచేసి గతంలో ఉన్న వేరియేషన్ను *కొనసాగించాలి
• ప్రతీ పది రోజులకు మార్కెట్ రేటు నిలకడగా అమలు చేయాలని తీర్మానాలను ఆమోదించారు.








కామెంట్లు (0)